అసెంబ్లీ ముట్టడి అడ్డుకట్ట – బీజేపీ నాయకుల అరెస్టుపై ఆగ్రహం
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పిలుపు మేరకు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన పలువురు నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఈ చర్యలను బీజేపీ నాయకులు ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం ప్రతిపక్షాల హక్కు అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల తరఫున పోరాటం చేయడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.
కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అడ్డుకోవడమే లక్ష్యంగా అక్రమ అరెస్టులు చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డిపల్లి సర్పంచ్ రాజిరెడ్డి, జిల్లా కోశాధికారి రామలింగారెడ్డి, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కోస్ని వినయ్ యాదవ్, అంకుసాపూర్ సర్పంచ్ అంచ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. ఇలాంటి చర్యలతో తమ పోరాటాన్ని అణిచివేయలేరని, ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.




