వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం: పూజల హరికృష్ణ
సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 24: సిద్దిపేట రూరల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తోందని తెలిపారు.
ఐకేపీ కేంద్రాల్లో రైతులకు అవసరమైన నీడ, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని, తేమ శాతం సరైన స్థాయికి చేరిన వెంటనే వడ్లను పారదర్శకంగా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే గన్ని బ్యాగులు, తేమ కొలిచే పరికరాలు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని, వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా తార్పాలిన్ షీట్స్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుర్రం అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ దేవి, ఉప సర్పంచ్ సుమన్, గ్రామ శాఖ అధ్యక్షులు దుబ్బ దుర్గయ్య, ఎండీ రాజ్ మహమ్మద్, పోతుగంటి శ్రీకాంత్, ఏఈఓ రాజు, దాస అంజన్న, అల్ల శ్రీనివాస్ రెడ్డి, పంతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






