calender_icon.png 27 June, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్‌ఎస్ పోరాటం: హరీష్ రావు

27-06-2025 02:40:44 PM

హైదరాబాద్: పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం(Patancheru Auto Drivers Association) ప్రతినిధులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును(Harish Rao) శుక్రవారం కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ జీవితం దయనీయంగా మారిందని ఆటో డ్రైవర్లు వాపోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆటో డ్రైవర్ల సంఘం సభ్యులు హరీశ్ రావును కోరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ...  ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ(Bharat Rashtra Samithi) పోరాటం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government) హత్యలే అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఏడాదికి రూ.12,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఆటో కార్మికుల గురించి ఒక్క మాటా మాట్లాడడం లేదని మండిపడ్డారు. ఆటోలు నడవక, బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆర్థికంగా డ్రైవర్లు కుదేలవుతున్నారని చెప్పారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులు కుటుంబాల పోషణ భారంగా కావడంతో ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఒక్కో కార్మికుడికి బాకీ పడ్డ రూ.24 వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని హరీష్ రావు కోరారు.