27-05-2025 05:20:01 PM
అడ్డు గోడను తొలగించిన హైడ్రా
హైదరాబాద్,(విజయక్రాంతి): సికింద్రాబాద్లోని మెట్టుగూడ డివిజన్ చిలకలగూడ దూద్బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు బాట దొరికింది. సోమవారం జీహెచ్ ఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డి గౌరవనీయ సీఎం గారు.. మా బడికి బాట వేయించండి అంటూ ప్ల కార్డు పట్టుకుని ధర్నాకు దిగారు. ఆ వార్త మీడియాలో ప్రసారం అవ్వడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. కమిషన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది ఇన్స్పెక్టర్ ఆదిత్య క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ పాఠశాలకు వెళ్లే దారికి అక్కడి నివాసితులు అడ్డంగా ప్రహరీ గోడను నిర్మించారు. జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్తో పాటు హైడ్రా సిబ్బంది అడ్డు గోడను తొలగించారు. ప్రహరీ తొలగించిన చోట వెంటనే గేటు ఏర్పాటు చేస్తామని జోనల్ కమిషనర్ రవి కిరణ్ చెప్పారు.