బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పట్నం మహేందర్ రెడ్డి, భీమ్ భరత్
చేవెళ్ల, జూలై 12 (విజయక్రాంతి): షాబాద్లో రాజ్ కుమార్ అనే ఉన్మాది జరిపిన కిరాతక హత్యాకాండపై శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం వారు బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. మృతుల నివాసానికి చేరుకున్న నాయకులు, అక్కడ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉన్మాది రాజ్ కుమార్ చేసిన ఘాతుకాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ‘బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో బాధితకుటుంబంలోని దివ్యాంగురాలు మేఘనను చూసి నాయకులు తీవ్రంగా చలించిపోయారు. మేఘనకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, ధైర్యంగా ఉండాలని వారు భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, చేవెళ్ళ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






