calender_icon.png 22 May, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.. మధ్య భారతంలో మారణహోమాన్ని ఆపాలి..

21-05-2025 08:26:38 PM

శాంతి చర్చల కమిటి ఛైర్మన్ జస్టిస్ చంద్ర కుమార్..

హనుమకొండ (విజయక్రాంతి): పీడిత ప్రజల విముక్తి కోసం గత అర్ధ శతాబ్దం నుండి పోరాటం చేస్తున్న మావోయిస్టులతో చర్చలు జరపడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సార్యం వీడి వెంటనే కాల్పులు విరమణ చేయాలని శాంతి చర్చల కమిటి ఛైర్మన్ జస్టిస్ చంద్ర కుమార్(Committee Chairman Justice Chandra Kumar) డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్ లో శాంతి చర్చల కమిటి ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో జైసింగ్ రాథోడ్ అధ్యక్షతన బుధవారం జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం(Round Table Meeting)లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

మధ్య భారతదేశంలో జరుగుతున్న పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరుగుతున్న అంతర్ యుద్ధంలో సామాన్య ప్రజలు, అమాయక ఆదివాసీలు చనిపోతున్నారని, ఆరు నెలల పాప, గర్భవతి, ఆహారం కోసం అడవికి వెళ్ళిన ఆదివాసీలు అసువులు బాస్తున్నారని, రాజ్యం తరుపున పోలీసులు సైతం మరణించి మధ్య భారతమంతా నెత్తురోడుతున్నదని అన్నారు. చనిపోతున్న వారిలో ఎవరు మావోయిస్టులో, ఎవరు ఆదివాసీలో తెలియని స్థితి నెలకొన్నదని ఈ మారణహోమాన్ని గమనించిన శాంతి చర్చల కమిటి అభ్యర్థన మేరకు మావోయిస్టు పార్టీ కాల్పులు విరమణ చేసి శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారని, కేంద్ర  ప్రభుత్వం మాత్రం స్పందించకుండా దాడులను మరింత పెంచి సామాన్య ప్రజలను సైతం నిష్కారణంగా చంపేస్తున్నారని, కాల్పుల విరమణ స్థితిలో ఉన్నవాళ్ళను చుట్టుముట్టి చంపేయడం చాలా దుర్మార్గమని విమర్శించారు.

భారతదేశంలో రక్తమెందుకు పారాలి? పోలీసులు, సామాన్య ప్రజలు, మావోయిస్టులు ఎందుకు చనిపోవాలని ప్రశ్నించాడు. హక్కుల కోసం పోరాటం జరిగిన నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, అస్సాం, మణిపూర్ ఉద్యమకారులతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకున్న భారత పాలకులు మావోయిస్టులతో చర్చలు జరిపితే సమస్య ఏంటని ప్రశ్నించారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళను సంప్రదించాలని చూసినా వారు పట్టించుకోవడం లేదని అన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడం కోసం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా వెంటనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదులను దేశంపైకి ఉసిగొల్పి అమాకులను చంపుతున్న శత్రు దేశంతో చర్చలు జరుపుతున్న పాలకులు మన దేశ పోరాటయోధులతో ఎందుకు చర్చలు జరపడం లేదో ప్రజలంతా ప్రశ్నించాలని  పిలుపునిచ్చారు.

ఛత్తీస్ ఘడ్ లో ఎన్నికల సమయంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తె మావోయిస్టులతో శాంతి చర్చలు జరుపుతామని మానిఫెస్టోలో పొందుపరచి అందుకు బిన్నంగా ప్రవర్తిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యల వల్ల మధ్య భారత దేశంలో ఆదివాసీల జీవనం మొత్తం చిన్నాభిన్నమై జీవించే హక్కు కోల్పోతున్నారని అన్నారు. ఇక నుండి ఏ ఒక్కరు చనిపోయినా మోడీ, అమిత్ షా లే  బాధ్యత వహించాలని, మధ్య భారత క్రూరత్వానికి బిజెపి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. దేశ భక్తి అంటే దేశంలోని ప్రజలు అభివృద్ధి చెంది సమానత్వం రావాలని, దేశ సంపదను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెట్టడం కాదని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన పాలకులు రాజ్యాంగ హక్కులను హరించి వేయడాన్ని ఎవరు ఒప్పుకోరని అన్నారు. మావోయిస్టులను చంపిన పోలీసులకు డబ్బులిస్తామని ప్రకటించడం ఏ నీతి అని, ఆర్ ఎస్ ఎస్ నీతి ఇదేనా? ఇది బుద్ధుడు పుట్టిన నేలనా అని ప్రశ్నించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాంతి చర్చల కమిటి రాష్ట్ర సభ్యుడు సోమ రామమూర్తి, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, చుంచు రాజేందర్, అనిక్ సిద్ధికి, చిల్ల రాజేంద్రప్రసాద్, బొట్ల బిక్షపతి, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ లు మాట్లాడుతూ మావోయిస్టులతో చర్చలు జరిపి భారతదేశంలోని ప్రజలను కాపాడాలని, చర్చలు జరపాల్సిన పాలకులు బేషిజానికి పోరాదని, చర్చలను పాలనలో బాగంగా చూడాలని అన్నారు.

ఆపరేషన్ కగార్ ప్రకటించిన తర్వాత మధ్య భారతదేశంలోని ఆదివాసీ ప్రజలను ఇళ్ల నుండి బయటకు రాకుండా నిర్బంధించి కనీస సౌకర్యాలు లేక హింసిస్తున్నారని, ప్రజలను రక్షించాల్సిన పాలకులు మారణహోమానికి పాల్పడుతుంటే పౌర సమాజం మౌనంగా ఉండరాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు ద్వారా ఎన్నుకోబడిన పాలకులు అదే ప్రజలను చంపడం దుర్మార్గమని, శాంతి చర్చలను సామాన్యుల సమస్యగా చూడాలని అన్నారు.

మావోయిస్టు రాజకీయాలకు శాంతి చర్చల కమిటీకి సంబంధం లేదని, సామాన్య ప్రజలను రక్షించడం, మానవ హననాన్ని ఆపడమే శాంతి చర్చల కమిటి లక్ష్యమని అన్నారు. మధ్య భారతంలో జరుగుతున్న పోరాటాన్ని మానవీయ కోణంలో చూడాలని అన్నారు. దాయాది దేశంతో చర్చలు జరపడానికి అఖిలపక్ష కమిటీలను వేసిన కేంద్ర ప్రభుత్వం పట్టింపులకు పోకుండా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడానికి అఖిల పక్ష కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. పౌర సమాజం వివిధ ప్రజా సంఘాల నాయకులు అన్ని ప్రతిపక్ష పార్టీలను సంప్రదించి శాంతి చర్చల కోసం దేశ వ్యాప్త ఉద్యమం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అబ్దుల్ నబీ, పండుగ శ్రీనివాస్, ఆదినారాయణ, దొమ్మటి ప్రవీణ్ కుమార్, కోండ్ర నర్సింగరావు, మిద్దేపాక ఎల్లన్న, బానోతు మంగీలాల్, ఉదయ్ సింగ్, డాక్టర్ జగదీష్, ముంజాల బిక్షపతి గౌడ్, రాదండి దేవేందర్, నున్న అప్పారావు, సూరం నిరంజన్, ఐతం నగేష్, నలిగింటి చంద్రమౌళి, సింగారపు అరుణ, పోతరాజు లక్ష్మీనారాయణ, బౌషెట్టి వెంకన్న, కందుకూరి దేవదాసు, యాకయ్య, వలపదాసు కుమార్, ఆర్ వి చలం, లాజరస్, కల్లెపెల్లి సుభద్ర, వెంకట నాయక్, మర్రి మహేష్, ధబ్బకట్ల సుమన్, పళ్ళకొండ హరికుమార్, చాగంటి కిషన్, ఎర్ర విజయ్, మంగీలాల్ నాయక్, మాన్ సింగ్, బిరుదురాజు శ్రీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు.