పెండింగ్ వేతనాలు చెల్లించాలి
లేక పోతే ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మె
మిషన్ భగీరథ కార్మికుల హెచ్చరిక
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో పనిచేస్తున్న మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ (AITUC) నాయకులు డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు హెచ్చరించారు. మంగళవారం AITUC ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మండల తహసిల్దార్ రియాజ్ అహ్మద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ కార్మికుల జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. వేతనాల కోసం పలుమార్లు L&T యాజమాన్యాన్ని సంప్రదించినప్పటికీ సరైన స్పందన లభించలేదన్నారు.
వేతనాలు అందక కార్మికులు కుటుంబాలను పోషించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పిల్లల చదువులు కూడా కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే ఆసిఫాబాద్ సెగ్మెంట్లో పనిచేస్తున్న సుమారు 600 మంది కార్మికులు ఏప్రిల్ 1 నుంచి AITUC ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలోకి దిగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AITUC జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరి చిరంజీవి, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చాపిడి బాలేష్ తదితరులు పాల్గొన్నారు.




