30-12-2025 09:17:21 PM
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలం గోపాల్పేట సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందిన వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని మెల్లకుంట తండ గ్రామానికి చెందిన మూడ బిచ్చు నాయక్ ఇటీవల బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ప్రమాదం అనంతరం బిచ్చు నాయక్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా, తలకు తీవ్రమైన గాయాల కారణంగా సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మంగళవారం గాంధీ ఆసుపత్రికి చేరుకుని, వైద్యులతో మాట్లాడి పోస్ట్మార్టం ప్రక్రియను పూర్తిచేయించారు. అనంతరం ప్రభుత్వ ఉచిత అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని స్వగ్రామమైన మెల్లకుంట తండకు తరలించే ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండల మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ...పేద కుటుంబానికి చెందిన బిచ్చు నాయక్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.మృతుని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,ఈ కష్టకాలంలో మృతుని కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని అందించారు.ఆయన వెంట దేవిసింగ్,శ్రీనివాస్,కుటుంబ సభ్యులు ఉన్నారు.