02-12-2025 02:11:17 PM
చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని స్థానిక ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు మున్సిపల్ అధికారులను కోరారు. డిసెంబర్ 2, కాలుష్య నివారణ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం విద్యార్థులు మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెద్ది నరేందర్ మాట్లాడుతూ నిషేధిత ప్లాస్టిక్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అన్నారు.
ముఖ్యంగా కిరాణా, కూరగాయలు, పండ్లు, పాలు తదితర వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ బ్యాగులను వాడటం వల్ల మానవాళి అనేక వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులకు పశుపక్షాదులకు హాని చేసేటువంటి ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని, ప్లాస్టిక్ రహిత పట్టణంగా చిట్యాల పట్టణాన్ని తీర్చిదిద్దాలని నరేందర్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పాఠశాల సిబ్బంది నమ్ముల ఆనందకుమార్, కె లింగస్వామి, విద్యార్థులు ఉన్నారు.