06-06-2025 12:00:00 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
హనుమకొండ, జూన్ 5 (విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో వివిధ రకాల పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, అధికారులు మొక్కలు నాటి నీళ్లు పోశారు.
కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, జడ్పీ సీఈవో విద్యాలత,జిల్లా అధికారులు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ కుమార్, లక్ష్మీ రమాకాంత్, చంద్రశేఖర్, రవీందర్ సింగ్, కలెక్టరేట్ పాలనాధికారి గౌరీ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలి
గురువారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలోని 17 వ నెంబర్ రేషన్ దుకాణాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. రేషన్ బియ్యం తీసుకునేందుకు అక్కడికి వచ్చిన కార్డుదారులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కొమరయ్య, ధర్మసాగర్ తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్, నాయబ్ తహసిల్దార్ సంతోష్ కుమార్, తదితరులతోపాటు స్థానికులు పాల్గొన్నారు.
భూభారతి రెవెన్యూ సదస్సు పరిశీలన..
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారం కోసం స్థానికులు దరఖాస్తు చేస్తుండగా రెవెన్యూ అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, ఆన్లైన్ చేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ సదానందం, నాయబ్ తహసిల్దార్ సంతోష్ కుమార్, ఎంపీడీవో అనిల్ కుమార్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసుకోవాలి..
గురువారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి పరిధిలోని సయ్యద్ నగర్ లో పలువురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతుండగా వాటిని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ డీఈ సిద్ధార్థ నాయక్, ధర్మసాగర్ ఎంపీడీవో అనిల్ కుమార్, ఇతర అధికారులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కమిటీ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.