17-06-2025 06:41:02 PM
న్యూఢిల్లీ: యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా రోజును ఘనంగా జరుపుకోవాలని, యోగా దినోత్సవ కార్యక్రమాల్లో గ్రామీణ ప్రజాలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. 'యోగా.. ఒక భూమి, ఒక ఆరోగ్యం' అనే థీమ్ తో ముందుకు వెళ్తున్నామని ప్రధాని అభిప్రాయపడ్డారు. యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని, యోగా ద్వారా మరింత ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక యోగా ప్రస్థానం విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. గత పదేళ్లుగా యోగా కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపడం మనందరికీ గర్వకారణమన్నారు.