22 April, 2026 | 3:29 AM

జంట హత్యల కేసు ఛేదించిన పోలీసులు

22-04-2026 02:11 AM

24 గంటల్లో నిందితుడు అరెస్ట్

శంషాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. శంషాబాద్ డీసీపీ బి రాజేష్, అడిషనల్ డీసీపీ ఎం ఎ మజీద్ ఆదేశాల మేరకు, మీర్‌చౌక్ ఎసిపి జి శ్యామ్ సుందర్ పర్యవేక్షణలో ఎస్హెచ్‌ఓ ఎం కొండల్ రావు మరియు పోలీసు బృందం ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితుడు ఆదిల్ ఖాన్‌ను ఏప్రిల్ 21 మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.

ఏప్రిల్ 20 సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో సుల్తాన్పురాలోని నివాసంలో అకీల్ ఖాన్ తన భార్య అజ్మీరా బేగంతో ఉండగా, అకీల్ ఖాన్ అన్న అయిన ఆదిల్ ఖాన్ కత్తితో దాడి చేసి ఇద్దరిని మెడ, ఛాతి భాగాల్లో పొడిచాడు. తీవ్ర గాయాలతో వా రు అక్కడికక్కడే మృతి చెందగా, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుండి ఒక మొబైల్ ఫోన్, రక్తపు మరకలతో ఉన్న బట్టలను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని సంఘటన స్థలం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మృతుడు అకీల్ ఖాన్ ముప్పు సం వత్సరాలు, డ్రైవర్గా పనిచేస్తుండగా, మృతురాలు అజ్మీరా బేగం(౨౬) గృహిణి. వీరిద్ద రూ భార్యాభర్తలు కాగా చాదర్ఘాట్ ప్రాంతానికి చెందినవారు. నిందితుడు ఆదిల్ ఖాన్ (౩౫) ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తూ పహాడీషరీఫ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.

ప్రాథమిక విచారణలో సంతానం విషయంలో అసూ య, పిల్లల దత్తతపై వివాదాలు, అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన ఎస్హెచ్‌ఓ ఎం కొండల్ రావు, డిఐ ఎన్ సైదయ్య, ఎస్‌ఐ సంతోష్ కుమార్, డబ్ల్యూఎస్‌ఐ సిహెచ్ అనిత, కానిస్టేబుళ్లు అరుణ్ కుమార్, ఆర్ భాస్కర్, శివ గౌడ్లను ఉన్నతాధికారులు అభినందించారు.