calender_icon.png 1 October, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ పార్టీల నేతలు సహకరించాలి

01-10-2025 01:54:54 AM

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ పార్టీల నేతలతో కలెక్టర్ సమావేశం 

రంగారెడ్డి, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి)  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో  జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల సహకారం అందించాలని  రాజకీయ పార్టీప్రతినిధులకు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక ఎన్నికల నిర్వహణపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు సర్పంచ్ ఎన్నికలను రెండు విడుతలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ తదితర పబ్లిక్ ప్లేస్ లలో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాలలో 72 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు.

అక్టోబర్ 9 న నోటిఫికేషన్ వస్తుందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫేజ్  I ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని, అక్టోబర్ 23 న మొదటి పోలింగ్ జరుగుతుందని తెలిపారు.  ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫేజ్  II ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని, అక్టోబర్ 27 న రెండవ విడత పోలింగ్ జరుగుతుందని తెలిపారు.

నవంబర్ 11న ఓట్ల లెక్కింపు నిర్వహించబడుతుందని అన్నారు.    సర్పంచ్ ఫేజ్  I ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని, అక్టోబర్ 31న మొదటి పోలింగ్ జరుగుతుందని తెలిపారు.  సర్పంచ్ ఫేజ్ ఫేజ్  II ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని, నవంబర్ 4న రెండవ విడత పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 

అదనపు కలె క్టర్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, కాంగ్రెస్ నుండి ఆవుల యాదయ్య, నవీన్ కుమార్,  జంగారెడ్డి, బిఆర్‌ఎస్ నుండి సత్తు వెంకటరమణ రెడ్డి, మిట్టూ జగదీశ్వర్, బిజెపి నుండి శ్రీరాములు, దేవేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు  పాల్గొన్నారు.