అచ్చంపేటలో ఫ్లెక్సీల రాజకీయ రగడ..
- పోలీసులతో బీజేపీ నేతల వాగ్వాదం
- మున్సిపల్ అధికారుల తీరుపై బీజేపీ నేతలు అగ్రహం
అచ్చంపేట జూన్ 30: అచ్చంపేటలోని ప్రధాన కూడలిలో రాజకీయ నేతల ప్లెక్సీ ఏర్పాటు రాజకీయ రగడకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గువ్వల బాలరాజు పుట్టినరోజు సందర్భంగా అచ్చంపేటలోని అంబేడ్కర్ కూడలిలోని హోర్డింగ్ పై ఆ పార్టీ నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అప్పటికే అక్కడ ఎమ్మెల్యే వంశీకృష్ణకు సంబంధించిన మరో ఫ్లెక్సీ ఉంది. దీంతో మున్సిపల్ అధికారులు అనుమతులు లేకుండా హోర్డింగ్ పై ప్లెక్సీలు ఏర్పాటు చేశారని.. దాన్ని పోలీసుల సహకారంతో తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో బిజెపి నేతలు అక్కడ చేరుకొని తొలగింపును ఆపే ప్రయత్నం చేశారు.
వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయడంతో పోలీసులకు బిజెపి నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి ఉద్రిక్తతల నడుమ మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీని తొలగించారు. సంఘటన స్థలంలో సిఐ నాగరాజు గొడవ జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ పుట్టినరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగించని మున్సిపల్ అధికారులు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే విషయంలో ఇలా వ్యవహరించడం సరైంది కాదని బీజేపీ నేతలు పేర్కొన్నారు.






