calender_icon.png 28 June, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొట్టమొదటిసారి పేదలకు, మహిళలకు బల్కంపేట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డులో చోటు: డా.కోట నీలిమ

28-06-2025 07:42:32 PM

సనత్ నగర్,(విజయక్రాంతి): బోనాల పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ దేవస్థానం ట్రస్ట్‌ బోర్డును ఏర్పాటు చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు చేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన ట్రస్ట్ బోర్డు సభ్యులు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కోట నీలిమను మర్యాద పూర్వకంగా కలిశారు. తమ నియామకానికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

కాగా ట్రస్ట్‌ బోర్డును ఏర్పాటు పట్ల డాక్టర్ కోట నీలిమ హర్షం వ్యక్తం చేశారు. నియమితులైన బోర్డు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈ యేడాది బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఇందుకోసం ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించిందని పేర్కొన్నారు. బోనాలు ఘనంగా నిర్వహించేందుకు గాను 13 మందితో బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ దేవస్థానం ట్రస్ట్‌ బోర్డును ఏర్పాటు చేసిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో లాబీయింగ్‌లకు అవకాశం లేదని.. కష్టపడ్డ వారినే పదవులు వరిస్తాయని స్పష్టం చేశారు. అందుకు దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటే నిదర్శనం అని పేర్కొన్నారు.  కొత్త బోర్డులో దాదాపు 60%కి పైగా వైట్ రేషన్ కార్డుదారులు ఉన్నారని తెలిపారు. పదవుల పంపకంలో కాంగ్రెస్ పార్టీ పేద, ధనిక భేదాలు చూడదని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డది పేద, మధ్య తరగతి వారైనా సరే వారికే పదవులు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనలో మరీ ముఖ్యంగా మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత లభించిందని, రాజకీయంగా మహిళలను ప్రోత్సహించిన ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. 

నూతనంగా బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ దేవస్థానం ట్రస్ట్‌ బోర్డులో 13 మందిలో ముగ్గురు మహిళలే ఉన్నారన్నారు. మహిళా సాధికారతే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పించి వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా బల్కంపేట ఆషాఢ మాస బోనాలు వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని బోర్డు సభ్యులకు సూచించారు.