calender_icon.png 7 February, 2026 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనోడు కాదు.. పరాయి వాడు

07-02-2026 05:20:59 PM

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలోని పరిగిలో శనివారం పర్యటించారు. నారాయనపూర్ లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి బాట బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అప్పులున్నా.. ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నామని, గత పాలకులు చేసిన తప్పులను సరిచేస్తూ పాలన కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. రెండేళ్ల ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నామని, స్థానిక సమస్యలు పరిష్కారించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నించలేదని సీఎం మండిపడ్డారు.

మోదీని చూసి ఓటేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారని, పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తే.. పిల్లగాడు పనికి రాకపోతే ఏం చేయాలి..? ఆయన ప్రశ్నించారు. మోదీని చూసి ఓటేస్తే.. గల్లీ బీజేపీ నేతలు పనిచేయకపోతే మోదీని అడగలేము కదా..? అని, బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు బొందపెట్టారని చెప్పారు. కాంగ్రెస్ తో పోరాడటం మా వల్ల కాదని.. బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోయిందని, కాంగ్రెస్ ను ఓడించేందుకే బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని సీఎం ఆరోపించారు.

ఓట్లు కావాలి కానీ.. ప్రజల సమస్యలను ఏనాడైనా పట్టించుకున్నారా...? అని ప్రశ్నించారు. పదేళ్లలో సమస్యలు పరిష్కరించి ఉంటే బీఆర్ఎస్ నేతలు అడగకుండానే ఓటేసేవారని, ఇప్పడు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది కాదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు కోసం రూ.38 వేల కోట్లతో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి పూనుకున్నారని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులను ఎందుకు నిర్వీర్యం చేశారని ముఖ్యమంత్రి అడిగారు. 

తెలంగాణ ఉద్యమ నాయకుడని చెప్పుకునే కేసీఆర్ రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను ఎందుకు అడ్డుకున్నారని, కేసీఆర్ మనోడు కాదు.. పరాయి వాడు.. పక్క రాష్ట్రం గురించే ఆలోచిస్తాడని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజమ్మ పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ చెప్పారని, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కట్టేందుకు ప్రణాళికలు పూర్తి చేస్తామన్నారు. కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూళేశ్వరమయ్యిందని, కాళేశ్వరం వల్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గోదావారి జలాల ముసుగులో వేల కోట్లు కొల్లగొట్టి ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని సీఎం విరుచుకుపడ్డారు.