31న భారత్కు వస్తా
సిట్ దర్యాప్తునకు సహకరిస్తా
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు, మే 27: లైంగిక ఆరోపణల కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మే 31న సిట్ ఎదుట హాజరవుతానని తెలిపారు. ఆయనకు సంబంధించిన అశ్లీల వీడియోలు బయటికి వచ్చిన నేపథ్యంలో విదేశాలకు వెళ్లిన తర్వాత మొదటి ఆయన ఈ కేసులో దర్యాప్తునకు సహకరిస్తానని వెల్లడించారు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మే 31న ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరవుతా. వాళ్లకు సహకరిస్తా. నాకు న్యాయవ్యవస్థ, చట్టంపై నమ్మకం ఉంది. నాపై ఉన్నవన్నీ తప్పుడు కేసులే. ఇదంతా రాజకీయ కుట్ర. ఈ విషయంలో నేను కొంత కుంగిపోయాను. అందుకే ఏకాంతంగా ఉండాలనుకున్నా. నేను ఎక్కడున్నానో చెప్పనందుకు నా కుటుంబానికి, పార్టీకి, కార్యకర్తలకు క్షమాపణలు చెబుతున్నా అని పేర్కొన్నారు. ఏప్రిల్ 26న ఎన్నికలు కాగానే నాపై ఎలాంటి కేసు లేదని, అప్పటికీ సిట్ ఏర్పాటు చేయలేదని చెప్పారు.
దేవెగౌడ హెచ్చరిక తర్వాత..
ప్రజ్వల్ జర్మనీలో ఉన్నట్లు సమాచారం. ఇండియాకు తిరిగిరావాలని ప్రజ్వల్ తాత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ హెచ్చరించిన మూడ్రోజుల తర్వాత ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.






