ప్రజ్వల్ను దేవెగౌడనే దేశం దాటించారు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు, మే 24: లైంగిక దాడులు, వేధింపుల కేసులో నిందితుడైన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు తన తాత, మాజీ ప్రధాని దేవెగౌడనే అన్నివిధాలా సాయపడి జర్మనీకి పంపించారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. దేవెగౌడ వెంటనే ప్రజ్వల్ లొంగిపోవాలని రాసిన బహిరంగ లేఖ ప్రజలను తప్పుదారి పట్టించేందుకేనని విమర్శిం చారు. ఇప్పటికే రేవణ్ణ దౌత్యపరమైన పాస్పోర్ట్ను రద్దు చేయించాలని తాను పీఎం నరేంద్ర మోదీకి లేఖ రాశానని గుర్తుచేశారు. కాగా, రేవణ్ణపై ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది. నిందితుడిని భారత్కు రప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. మరోవైపు లైంగిక ఆరోపణల కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతం చేస్తున్నది. ఇప్పటికే దాడులకు గురైన బాధిత మహిళల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నది. అనేక ఆధారాలు, వీడియో ఫుటేజీలను సేకరించింది.






