4 March, 2026 | 11:49 AM

అనుమానాస్పద స్థితిలో నాలుగు నెలల గర్భిణీ మృతి

04-03-2026 09:57 AM

పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం.

వేరు కాపురం అనంతరం ఏడాదికి ఘటన. 

తాగిన మైకంలో భర్త కాలితో తన్నడం వల్లే మృతి చెందినట్లు అనుమానం. 

నాగర్ కర్నూల్(విజయక్రాంతి): అనుమానాస్పద స్థితిలో నాలుగు నెలల గర్భవతి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు ప్రకారం కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామానికి చెందిన బత్తిని మౌనిక (21) కొల్లాపూర్ మండలం మ్యాదరంపేట గ్రామానికి చెందిన నాగరాజు (25)తో ఏడాది క్రితం పరిచయమైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో వేరు కాపురం ఉంటూ కుటుంబాన్ని నడపడం కోసం ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అయిన మౌనిక గత నాలుగు రోజులుగా తల్లి(రూబెల్లా) తోనూ బాధపడుతోంది. మంగళవారం ఉదయం తీవ్ర రక్త శ్రావంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో  సోమవారం రాత్రి వరకు తమ బిడ్డ తమతో ఫోన్లో మాట్లాడిందని ఉదయం మృతి చెందడంతో మృతి పట్ల  గర్భిణీ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాగిన మైకంలోనే భర్త నాగరాజు భార్యను కాలితో తన్నడం వల్లే తీవ్ర రక్తస్రావంతో తమ బిడ్డ మృతి చెందినట్లు మృతురాలి అన్న చంద్రశేఖర్ ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు కొల్లాపూర్ ఎస్సై బండారి సురేష్ తెలిపారు. తమ బిడ్డను తాగిన మైకంలో చిత్రహింసలకు గురిచేసి హతమార్చినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.