14-11-2025 11:52:09 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. శుక్రవారం పెంచికల్పేట్ మండల పరిధిలోని బొంబాయిగూడ, చేడ్వాయి గ్రామలలో సుమారు రూ. 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. గ్రామ పంచాయతీ భవనం అందుబాటులోకి వస్తే, గ్రామ కార్యకలాపాలు, సమావేశాలు నిర్వహించడానికి, ప్రజలకు సేవలు అందించడానికి కార్యదర్శి, సిబ్బందికి శాశ్వత వేదిక లభిస్తుందని తెలిపారు. గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా ఇది మరో ముందడుగు అని పేర్కొన్నారు. చేడ్వాయి గ్రామానికి చెందిన చింతపూడి సత్తయ్య ఇద్దరు కుమార్తెలకు ఇచ్చిన మాట ప్రకారం చెరో 25వేల రూపాయలు బాండ్ ను వారికి అందచేశారు.