31 March, 2026 | 1:54 AM

ప్రణాళికాబద్ధంగా సమస్యలు పరిష్కరించాలి

31-03-2026 12:00 AM

వార్డు సమస్యల పరిష్కారంలో పాలక మండలిదే కీలక పాత్ర

ఆదాయ వనరులు పెంచి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి

కలెక్టర్ తేజస్ నందలాల్

సూర్యాపేట, మార్చి 30 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం స్థానిక రవి మహాల్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అధ్యక్షతన నిర్వహించిన పురపాలక సంఘం 2025-26 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్, 2026-27 ముసాయిదా బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

వార్డు స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ పాలక మండలిదే కీలక బాధ్యత అన్నారు. నూతన పాలక మండలి తొలి సమావేశంలోనే రూ.107.32 కోట్లతో బడ్జెట్ రూపొందించడం అభినందనీయమని అన్నారు. ఈ బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంపొందించి పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పట్టణంలో పరిశుభ్రత నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టులు, తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మహిళల భద్రత, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మున్సిపాలిటీకి రావలసిన ఇంటి పన్ను, నల్లా బిల్లులు, ఇతర బకాయిల వసూళ్లలో ప్రజలను చైతన్యపరచి సమయానికి చెల్లించేలా ప్రోత్సహించాలని అన్నారు. అక్ర మ భవన నిర్మాణాలను అరికట్టి, మున్సిపాలిటీకి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకో వాలని సూచించారు.

అదేవిధంగా మున్సిపాలిటీ ఆస్తులను పరిరక్షించడంపై దృష్టి సారించాలని, గతంలో జాతీయ, రాష్ట్ర స్థా యిలో సూర్యాపేట మున్సిపాలిటీ సాధించిన గుర్తింపును తిరిగి సాధించేందుకు కృషి చేయాకన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి మొరిశెట్టి నివేదిత లక్షాధి, వైస్ ఛైర్పర్సన్ యం. డి. షఫీ ఉల్లా, కమీషనర్ సి.ఎచ్. హన్మంతరెడ్డి, మున్సిపల్ పాలక మండలి సభ్యులు అధికారులు పాల్గొన్నారు.