15-05-2025 01:38:27 AM
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే రెండేండ్లలో.. 2027 జూన్ నాటికి రాష్ట్రంలో కృష్ణానదిపై అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచించారు. అందుకు అనుగుణంగా నిర్ణీత గడువుతో పాటు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు.
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగంగా చేపట్టాలని సూచించారు. కృష్ణా బేసిన్లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బందిలేకుండా చూడాలని ఆర్థికశాఖను ఆదేశించారు. భూసేకరణ వేగంగా పూర్తయ్యేందుకు రెవెన్యూ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని.. స్పెషల్ ఆఫీసర్లు పనులను వేగవంతం చేయాలని చెప్పారు.
ఇటీవల కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన 244 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 199 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు బుధవారం సాయంత్రం జలసౌధ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియామకపత్రాలను అందించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్సుల్తానియా, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్బొజ్జా, కార్యదర్శి ప్రశాంత్పాటిల్, ఈఎన్సీ అనిల్కుమార్ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలసౌధలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జైపాల్రెడ్డి పాలమూరు ప్రాజెక్టును ఉద్దండాపూర్ వరకు మొదటి ప్రాధాన్యంగా పూర్తిచే యాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉద్దండాపూర్ వరకు పెండింగ్లో ఉన్న పనులు 18 నెలల్లో పూర్తి చేయాలని, అందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలని చెప్పారు.
కోయిల్సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్లోగా పూర్తి చేయాలని చెప్పారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్, జహహర్ నెట్టెంపాడు లిఫ్ట్, రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబర్లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి పెండింగ్లో ఉన్న పనులు, కావాల్సిన నిధుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
కృష్ణాజలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం సుమారు 70 శాతం తెలంగాణలోఉంటే కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందున.. కృష్ణా జలాల్లో 70శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రిబ్యునల్ ఎదుట పట్టుబట్టాలని చెప్పారు.
గోదావరి బేసిన్ నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ తీసుకుంటున్న 90 టీఎంసీలను ఎగువన వాడుకునేలా నీటి కోటా పెంచుకోవాలని చెప్పారు. ఈ అంశాలన్ని కృష్ణాబోర్డు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పాలమూరు ప్రాజెక్టు చేపట్టేటప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నీటి వాటాల అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.