30-06-2025 08:42:17 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు చాగంటి కిషన్(Chaganti Kishan) డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడానికి అనేక విధాలుగా ఉద్యమించినట్లు చెప్పారు. స్వరాష్ట్ర కలను నెరవేర్చుకున్న సమయంలో ఉద్యమకారులకు తగిన గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ మలిదశ ఉద్యమ కారులకు 250 చ. గ. ఇంటి స్థలం, డబుల్ బెడఁరూమ్ ఇంటి నిర్మాణం, నెలకు 25 వేల పెన్షన్ సౌకర్యం, తెలంగాణ రాష్ట్రం కొరకు ఆత్మ బలిధానం చేసిన వీరులకు ఆర్ధిక సహాయంతో పాటు వారి కుటుంబానికి ఉద్యోగ సదుపాయం కల్పిస్తామని హామీలు ఇవ్వడం జరిగిందన్నారు.
హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా, ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించకపోవడం తమను అవమానించాడమేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో దశల వారీగా ఉద్యమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ జాక్ కన్వీనర్ మోడెమ్ రవిధర్ గౌడ్, పూర్వ విద్యార్ధి యువజన జాక్ కన్వీనర్ దండు శ్రీనివాస్, బాలమోహన్, సోమరాపు వెంకటయ్య, చిట్యాల వీరన్న, గాండ్ల మాలెందర్, కళాకారుడు వంగాల అశోక్, జనిగాలా పరమేష్, వేం వేంకట్ రెడ్డి, కీర్దీ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.