30-06-2025 08:38:21 PM
విహెచ్పిఎస్ జాతీయ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ..
మందమర్రి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఎన్నికల హామీ ప్రకారం రాజకీయ రిజర్వేషన్ ప్రకటిస్తూ చట్ట సవరణ ఆర్డినెన్స్ ఆదేశాలు జారీ చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ(VHPS National Leaders Peddapalli Satyanarayana) డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల పెన్షన్ 6000, ఇతర ఆసరా పెన్షన్లు 4000, తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులకు 15000 పెన్షన్ వెంటనే ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలలో చట్ట ప్రకారం క్యాడర్ స్ట్రేంత్ ప్రకారం 4 శాతం ఉద్యోగాలను భర్తీ చేయాలని, వికలాంగుల రోస్టర్ సంఖ్యను 10 లోపు సవరించి ఎస్ఆర్డి జిఓను తక్షణమే ఇవ్వాలనీ, డ్రెస్ కోడ్ ఉద్యోగాలలో 4శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
దివ్యాంగుల హక్కుల చట్టం 2016 సమర్ధవంతంగా అమలు కోసం స్వతంత్ర కమిషన్, రాష్ట్ర సలహా సంఘం, జిల్లా కమిటీలు వెంటనే నియమించాలనీ, ఆర్టీసి బస్సులలో ఉచిత రవాణ సౌకర్యం రైలులో ఉచిత ప్రయాణం కల్పించాలనీ కోరారు. ప్రతి జిల్లాలో తీవ్ర వైకల్య వ్యక్తులకు పునరావాస సదనాలు ఏర్పాటు చేయడంతో పాటు యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతి మాదిరిగా వికలాంగులకు ప్రత్యేకంగా ఆసుపత్రి, శిక్షణ, ఉత్పత్తి పునరావాస సదనాలు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికలాంగుల స్వయం సహాయక సంఘాలను అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసి పాత సంఘాలను బలోపేతం చేయాలని, మనోవికాస కేంద్రాలను ప్రతి మండలంలో ఏర్పాటు చేసి సిబ్బందికి హెచ్ఎర్ పాలసీ వర్తింప చేయాలన్నారు.
దివ్యాంగుల చట్టం సెక్షన్ 92 ప్రకారం వికలాంగులకు పోలీసు, న్యాయ, ఇతర శాఖల నుండి ప్రత్యేక రక్షణ సదుపాయాలు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా వర్తింప చేయాలనీ, ప్రతి వికలాంగునికి యాభై లక్షల విలువ గల ఆరోగ్య భద్రత భీమా కార్డు ఇవ్వాలనీ, దివ్యాంగ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు దివ్యాంగులగ పెన్షన్ వర్తింపచేయాలనీ, లేదంటే ప్రభుత్వ ప్రత్యేక అలవెన్స్ ఇవ్వడంతో పాటు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలనీ ఆయన డిమాండ్ చేశారు. సుప్రీమ్ కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని ప్రభుత్వ ప్రజా భవనాలు, ప్రదేశాలలో ర్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో విహెచ్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు బానోతు అఖిల, మండల అధ్యక్షులు బొద్దుల బుచ్చి రాజం, నాయకులు ఇందూరి రమేష్, దురిశెట్టి లక్ష్మణ్, మాడావి షేక్ రావు, కొంతం రాజు, భూక్య కిషన్, భూక్య మంజు, నాయిని చిలకయ్య, దర్శనాల నర్సయ్య, బానోతు సుశీలలు పాల్గొన్నారు.