01-02-2026 05:42:20 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ములకలపల్లి మండల వ్యాప్తంగా ఆదివారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మండల వ్యాప్తంగా అన్ని పంచాయితీలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులపై చేరుకొని రాస్తారోకోలు నిర్వహించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేసీఆర్ కుటుంబాన్ని ఎలాగైనా బదనాం చేయాలనే ఒక కక్షపూరితమైన రాజకీయ క్రీడను అవలంబిస్తూ ప్రభుత్వం కాలం గడుపుతోందని ఆరోపించారు.కక్ష రాజకీయాలకు స్వస్తి పలికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.