02-08-2025 04:58:27 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..
జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు సిబ్బంది ఉద్యోగులు కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) ఆదేశించారు. జిల్లాలోని తాడిచర్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్యం, మందుల లభ్యత, సిబ్బంది హాజరు, వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందుల స్టాక్, శానిటేషన్ పరిస్థితులు, రికార్డుల నిర్వహణ, ఓపి రిజిస్టర్ తదితర అంశాలను సమీక్షించారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది సమయానికి హాజరవుతున్నారా? రోగులకు తగిన వైద్యం అందించబడుతుందా అనే అంశాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలు తొలగించి మొక్కలు నాటాలని ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.