28-06-2025 11:33:21 PM
రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ అయేషా మస్రత్ ఖానం
మంచిర్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ అయేషా మస్రత్ ఖానం అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు హరిశ్చంద్రారెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సులేమాన్, టి.జి.ఎం.ఐ.డి.సి. ఈ.ఈ. నరసింహరావు లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలలో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని, త్వరలో విద్యాబోధన కొరకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడంతో పాటు ఒప్పంద పద్దతిన ఇతర పోస్టులలో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్న పోస్టులను అవసరం ఉన్న మేరకు భర్తీ చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ అనారోగ్య సమస్యలపై వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
జిల్లాలో తలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల, మాతా-శిశు కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్మాణం కొనసాగుతున్న మాతా-శిశు ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి వార్డులు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.