02-06-2025 07:00:11 PM
దౌల్తాబాద్: అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి(Cheruku Srinivas Reddy) అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని(Telangana State Formation Day) పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజలు కలసికట్టుగా సుదీర్ఘకాలం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నామని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి తెలంగాణ రాష్ట్ర కళను నెరవేర్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 21 వేల కోట్ల పైగా రుణమాఫీ చేశామని సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి రైతన్నకు అండగా నిలిచామన్నారు.
60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఓవైపు ఉద్యోగుల భర్తీ మరోవైపు రాజీవ్ వికాసం స్కీం ద్వారా స్వయం ఉపాధికి బాటలు వేస్తూ యువత కలలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ అన్ని రంగాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారు లాలు, నాయకులు కర్నాల శ్రీనివాసరావు, స్వామి, మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, ఏసు, ప్రవీణ్, అమరేందర్ రెడ్డి, నర్సింలు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.