02-06-2025 07:02:50 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పోలీస్ స్టేషన్ లో విధుల్లోనే గుండెపోటుకు గురై ఏఎస్ఐ మద్దెర్ల కృష్ణమూర్తి(58) మృతి చెందడం పోలీసుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కృష్ణమూర్తి గుండెపోటుతో కుప్పకూలగా, వెంటనే సహచర పోలీసులు అతనికి సిపిఆర్ చేసి 108 అంబులెన్స్ లో మహబూబాబాద్ కు తీసుకువెళ్లారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. కొద్దిసేపటి వరకు తమతో విధులు నిర్వహించిన ఏఎస్ఐ అంతలోనే విగత జీవిగా మారడంతో పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఏఎస్ఐ కృష్ణమూర్తి పార్థివదేహాన్ని వరంగల్ నగరంలోని వడ్డేపల్లిలో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకువెళ్లారు. కృష్ణమూర్తి కుమారుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏఎస్ఐ పార్థివ దేహాన్ని మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్, నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు, కేసముద్రం పోలీసులు సందర్శించి, నివాళులర్పించారు.