12-10-2025 04:53:33 PM
హైదరాబాద్ (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా పోలియో నిర్మూలనలో భాగంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు జిల్లాలను ఎంపిక చేసింది. ఆ జిల్లాల్లో హైదరాబాద్ నగరం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో సనత్ నగర్ డివిజన్లోని బీ.కే. గూడా భారతి నర్సింగ్ హోమ్ ఆవరణలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ సనత్ నగర్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఆకుల మహేష్ కుమార్, బీజేపీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ ముదిరాజ్, బీజేపీ ఇంటెలెక్చువల్ సెల్ జాయింట్ కన్వీనర్ శివప్రసాద్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అశ్విని శ్రావణ్, అలాగే సంబంధిత అధికారులు స్వప్న, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఆకుల మహేష్ కుమార్ మాట్లాడుతూ.. “పోలియో నిర్మూలనలో భాగంగా ప్రతి తల్లిదండ్రి తన పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో ఇది ప్రతి ఒక్కరి బాధ్యత” అని తెలిపారు.