12 June, 2026 | 7:17 PM

మంత్రి శ్రీధర్ బాబుపై విమర్శలు చేస్తే పుట్టకు రాజకీయ భవిష్యత్తు ఉండదు

12-06-2026 06:09 PM

జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి ఐలి శ్రీనివాస్  హెచ్చరిక

మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుపై అసత్య ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పుట్ట మధుపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంథనిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనగామ నరసింహారావు, జిల్లా కార్యదర్శి అయిలీ శ్రీనివాస్ తోపాటు నేతలు మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతల తీరును తప్పుబట్టారు.

అసత్య ప్రచారాలు ఆపాలి

గత మూడు రోజులుగా బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మంత్రి శ్రీధర్ బాబు ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, వీటిని మంథని నియోజకవర్గ ప్రజలు ఎవరూ నమ్మడం లేదని స్పష్టం చేశారు.

పుట్ట మధుకు హెచ్చరిక

ఒకప్పుడు మంత్రి శ్రీధర్ బాబు కుటుంబం వద్ద శిష్యుడిగా ఉండి, ఆ కుటుంబం ద్వారా లబ్ధి పొందిన పుట్ట మధు, నేడు అదే కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. మంత్రిపై నోరు పారేసుకుంటే సహించేది లేదని, మంథనిలో తిరగడం కష్టమవుతుందని హెచ్చరించారు.

అవినీతి, ఆరోపణలపై విమర్శలు

పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అవినీతి, ఇసుక-మట్టి మాఫియా, హత్యల ఆరోపణలు మంథని ప్రజలకు గుర్తున్నాయని నేతలు గుర్తుచేశారు. ఆ జంట హత్యల కేసులో ఆయన కుటుంబానికి ఉన్న సంబంధం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు.

అభివృద్ధే లక్ష్యం

శ్రీధర్ బాబు కుటుంబం ప్రజా సేవకే అంకితమైందని, ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రిపై బురద జల్లడం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంథని రాకేష్, డివిజన్ ఉపాధ్యక్షులు మంథని సమ్మయ్య, మాజీ సర్పంచులు చంద్రు రాయమల్లు, మంథని కర్ణ కృష్ణ, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటిగారి కిషన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.