12-06-2025 09:01:56 PM
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..
హనుమకొండ (విజయక్రాంతి): గురువారం హనుమకొండ, న్యూ శాయంపేటలోని పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమాన్ని ఎంపీ డాక్టర్ కావ్య(MP Dr. Kavya), హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య(District Collector Pravinya), విద్యాశాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఎంపీ, కలెక్టర్ మొక్కలు నాటి నీళ్ళు పోశారు. పాఠశాల ఆవరణలోని మొక్కలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... పిల్లల భవిష్యత్తు, ముందు తరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరికీ విద్య అనేది అందుబాటులో ఉండాలన్నారు. సాధారణమైన విద్య కాకుండా నాణ్యమైన విద్యా బోధనా అందుబాటులో ఉండాలన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన ఉంటుందని, క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజున పాఠశాలకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాల నిర్వహణతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ ను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన సాగుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం విజన్- మిషన్ తో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉప్పలయ్య మాట్లాడుతూ పాఠశాలలో 200పైగా విద్యార్థుల నమోదు శాతానికి పెంచేందుకు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ ఎంపీ, కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మనోజ్ కుమార్, కాజీపేట పురుషోత్తం, శ్రావణ్ కుమార్, ఉపేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాధ, తదితరులతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.