28 March, 2026 | 3:14 AM

గ్యాస్ కోసం బారులు

28-03-2026 01:35 AM
  1. రాత్రంతా రోడ్ల పైనే ఆటోలు, ట్యాక్సీలు కిలోమీటర్ల మేర క్యూలు
  2. తగినన్ని నిల్వలున్నాయి..  అధికారుల స్పష్టీకరణ

హైదరాబాద్, సిటీ బ్యూరో మార్చి 27 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో సీఎన్జీ గ్యాస్ కోసం ఆటోడ్రైవర్లు, క్యాబ్‌లు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇంధనం దొరకదు.. బంకులు మూసేస్తారు అంటూ ప్రచారం జరుగుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రంతా సీఎన్జీ గ్యాస్ కోసం డ్రైవర్లు రోడ్లపైనే పడిగాపులు కాసారు.

గురువారం సాయంత్రం నుంచే ఆటోనగర్లోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు ఆటోలు పెద్దఎత్తున క్యూ కట్టాయి. గ్యాస్ కోసం తమ వంతు ఎప్పుడు వస్తుందా అని డ్రైవర్లు ఆటోల్లోనే రాత్రంతా నిరీక్షించారు. వందలాది ఆటోలు ఒకేసారి బంక్ వద్దకు చేరుకోవ డంతో.. ఆటోనగర్ కూడలి నుంచి సుష్మా సాయినగర్ కాలనీ మీదుగా హుడా సాయినగర్ వరకు కిలోమీటర్ల మేర ఆటోలు బారులు తీరాయి.

దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫి క్ స్తంభించిపోయింది. రోజువారీ కిరాయిలు వదిలేసుకుని మరీ డ్రైవర్లు ఇలా గ్యాస్ కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. నగరంలో రాబోయే రోజుల్లో పెట్రోల్, సీఎన్జీ గ్యాస్ దొరకదనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు సోషల్ మీడియాలోనూ వదంతులు వ్యాపించడంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఆందోళనకు గురవు తున్నారు.

గ్యాస్ దొరకదనే భయంతో అందరూ ఒకేసారి స్టేషన్లకు రావడంతో బంకుల వద్ద రద్దీ పెరిగిపోయి, కృత్రిమ కొరత ఏర్పడుతోందని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. ఒక బంక్‌లో గ్యాస్ అయిపోతే.. మరో బంకుకు పరుగులు పెడుతూ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన కొరతపై వస్తున్న వార్తలను సంబంధిత అధికారులు ఖండించారు. నగరంలో సరిపడా పెట్రోల్, ఎల్పీజీ ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

ఎక్కడ ఎలాంటి కొరతా లేదు. ప్రజలు, వాహనదారులు అనవసరంగా ఆందోళన చెందవద్దు.. అని అధికారులు విజ్ఞప్తి చేశారు. పుకార్లను నమ్మి ఒకేసారి బంకుల వద్దకు గుంపులుగా రావడం వల్లే ఈ రద్దీ ఏర్పడుతోందని, వదంతుల ను నమ్మవద్దని స్పష్టం చేశారు.