calender_icon.png 28 May, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబైని ముంచెత్తిన వర్షాలు

27-05-2025 12:40:45 AM

ముంబైలో కుండపోత.. రెడ్ అలర్ట్ జారీ

నైరుతి రుతుపవనాలు ముంబై మహానగరానికి కుంభవృష్టిని తెచ్చాయి. రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ భారీ వర్షానికి 107 ఏండ్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. చివరిసారిగా 1918, మే నెలలో 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా.. ఇప్పుడు ఆ రికార్డు బద్ధలైంది.

భూగర్భ మెట్రోస్టేషన్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. ఆచార్య అత్రే చౌక్ భూగర్భ మెట్రోస్టేషన్ వరదనీటితో మునిగిపోయింది. ముంబైతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడులకు కూడా ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. 

- అతలాకుతలమైన మహానగరం

- 107 ఏండ్లలో ఇదే అత్యధికం

- జలమయమైన లోతట్టు ప్రాంతాలు

- ముంబైతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలు జారీ 

- ముంబైలో ఒకరు, కేరళలో చెట్టు కూలి మరొకరు మృతి

- రైలు, విమాన సర్వీసులకు ఆటంకం

-ముందస్తు రుతుపవనాలకు వాతావరణ మార్పులే కారణం? 

ముంబై, మే 26: ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. ఎప్పుడో 107 ఏండ్ల కింద కురిసిన వర్షపు రికార్డులను చెరిపేస్తూ ఆది వర్షం కొత్త రికార్డులు నెలకొల్పింది.

వర్షం ధాటికి అనేక ప్రాంతాల్లో రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ముంబై మహానగరంలో పలు లోకల్ ట్రైన్స్ ఆలస్యంగా నడవగా.. మరికొన్నింటిని రద్దు చేశారు. భారీ వర్షాల వల్ల విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. కేవలం ముంబై అనే కాకుండా చాలా రాష్ట్రాల్లో వరణుడు ప్రతాపం చూపెట్టాడు.

ఈ ఏడాది నైరుతి ముందుగా రావడంతో వర్షాలు ముందస్తుగానే కురుస్తున్నాయి. ముంబైతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడులకు కూడా ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ముంబై మహానగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే కుండపోత వాన మొదలయి.. సోమవారం ఉదయం 11 గంటల సమయానికి అనేక ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు చేరుకుంది.

కేవలం బృహత్ ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) పరిధిలో మాత్రమే కాకుండా ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి 107 ఏండ్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. చివరిసారిగా 1918లో మే నెలలో 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా.. ఇప్పుడు ఆ రాకార్డు బద్దలైంది.

1990 తర్వాత తాజాగా.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో 16 రోజుల ముందుగానే వర్షం కురిసింది. ఈ వర్షాల ధాటికి అనేక ప్రాంతాలు జలమయమవగా.. ఒకరు మృతి చెందగా.. 48 మందిని రెస్యూ బృందాలు రక్షించినట్టు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. 

నీట మునిగిన మెట్రో స్టేషన్లు 

ముంబైలో మునుపెన్నడూ లేనంతగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అలాగే ముంబై నగరంలోని భూగర్భ మెట్రోస్టేషన్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. ఇటీవలే ప్రారంభించిన ఆచార్య అత్రే చౌక్ భూగర్భ మెట్రోస్టేషన్ వరదనీటితో మునిగిపోయింది.

లైన్ మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్) ప్రకటించింది. ప్రతి ఏడాది నైరుతి రుతుపవనాలు ముంబైని జూన్ 11 వరకు చేరుకుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం 16 రోజుల ముందుగానే మహానగరానికి చేరుకుని.. అతలాకుతలం చేస్తున్నాయి.

బీఎంసీ పరిధిలోని నారిమన్ పాయింట్ ప్రాంతంలో ఉదయం 11 గంటల వరకు 252 మిల్లీమీటర్లు, బైకుల్లా ఈవార్డ్‌లో 213 మిల్లీమీటర్లు, కొలాబాలో 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పూనే, సతార, సింధుదుర్గ్, థానే, రాయిగడ్, రత్నగిరి జిల్లాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది. 

వాతావరణ మార్పులే కారణమా.. 

దేశంలో రుతుపవనాలు ముందస్తుగా రావడానికి వాతావరణ మార్పులే కారణం అని తెలుస్తోంది. రుతుపవనాలు వాతావరణంతో ఎక్కువగా ప్రభావితం అవుతాయి. వాతావరణంలో మార్పులు సంభవించడం వల్లే ఈ ఏడాది రుతుపవనాలు ముందస్తుగా వచ్చినట్టు తెలుస్తోంది. 

దక్షిణాదికి హెచ్చరికలు..

దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు కూడా రెడ్ అలర్ట్స్ జారీ అయ్యాయి. కర్ణాటక తీరప్రాంతాల్లో భారీ వర్షం కురిసి సామాన్య జనజీవనం అతలాకుతలం అయింది. కర్ణాటక తీరప్రాంతాలకు ఐదు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడులోని పలు ప్రాంతాలకు ఆ రాష్ట్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

నీలగిరి కొండల చుట్టూ ఉండే కోయంబత్తూర్, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కేరళను కూడా వర్షాలు అతలాకుతలం చేశాయి. అక్కడ కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో వరదలు సంభవించాయి. త్రిశూర్‌లో కదులుతున్న ఓ రైలుపై చెట్టు కూలింది. అంతే కాకుండా కోజీకడ్‌లో స్కూటర్‌పై పయనిస్తున్న ఓ వ్యక్తిపై కూడా చెట్టు కూలడంతో వ్యక్తి మరణించాడు.