27-10-2025 06:33:11 PM
ఎవరేమనుకున్నా... రామగుండంను మెడికల్ హబ్ గా మారుస్తా...
గుండె చికిత్స కోసం హైదరాబాద్ దాకా వెళ్లొద్దనేదే నా తపనంతా..
అతి త్వరలోనే క్యాథలాక్ సెంటర్ అందుబాటులోకి తీసుకొస్తా
సిమ్స్' ను అద్భుత కళాశాలగా తీర్చిదిద్దుతా..
కొన్ని నష్టాలను భరించుకుంటేనే అభివృద్ధి లక్ష్యం చేరుకుంటాం..
రామగుండం భవిష్యత్ మార్చేంత వరకు నిద్రపోను...
విలేకరుల సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని: ఎవరేమనుకున్నా... అభివృద్ధిలో నా పంతం తగ్గదని... కొన్ని నష్టాలు భరించుకుంటేనే అనుకున్న లక్ష్యంకు చేరుకుంటామని అతి త్వరలోనే రామగుండంను మెడికల్ హబ్ గా మీ ముందుకు తీసుకొస్తానని.. అత్యవసరంగా గుండె చికిత్స కోసం హైదరాబాద్, కరీంనగర్ దాకా వెళ్లొద్దనేదే నా తపనంత అని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్(MLA Makkan Singh Raj Thakur) స్పష్టం చేశారు. సోమవారం నాడు స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతి ఆపరేషన్ ఇక్కడే జరిగేలా సింగరేణి దవాఖాన వెనుకాల రూ.25 కోట్లతో క్యాథలాక్ సెంటర్ నిర్మాణం జరుగుతుందని, అలాగే సిమ్స్ ను అద్భుత కళాశాల, ఆస్పత్రిగా తీర్చిదిద్దుతానని.. ఈరోజు విమర్శలు చేసిన వారే రేపు రామగుండంను చూసి ఆశ్చర్యపోయేలా చేస్తానని.. గత పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని తాను రెండేళ్లలోనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు సహకారంతో రామగుండంకు రూ.800 కోట్లు తీసుకవచ్చి ఈ ప్రాంత రూపురేఖలు మారుస్తుంటే ఓర్వలేకపోతున్నారని.. వారి విమర్శలు నేను పట్టించుకోను.. అని తెలిపారు.
రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణం జరుగుతుందనీ, మరో రూ.30 కోట్లతో అక్కడే క్రీడా మైదానం కూడా చేపడుతామన్నారు. నేను మొదటి నుంచి మొండిఘటుడినని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీపడే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల సరసన రామగుండం త్వరలో చేరబోతుందనీ, ఇప్పుడు వెనుకాల మాటలు అన్నవారే రేపు ఈ నగరంను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి తీసుకవస్తానన్నారు. ముఖ్యంగా గుండె వ్యాధులతో హైదరాబాద్ కు వెళ్లేలోపే మనలోని ఎంతోమంది బంధువులు చనిపోయిన సంఘటనలు చూస్తున్నామనీ, అలాంటి పరిస్థితి రావొద్దని రూ.25 కోట్లతో సింగరేణి ఆస్పత్రి వెనుకాల క్యాథలాక్ సెంటర్ నిర్మాణం జరుగుతుందనీ, అనుభవజ్ఞులైన వైద్యులతో ఇక్కడే గుండె శస్త్ర చికిత్సలు జరుగుతాయన్నారు.
అలాగే ఇటీవలనే రూ.50 కోట్లతో ఐటీఐని ఏటీసీగా నిర్మించుకున్నామనీ, ఇప్పటికి వంద అడ్మిషన్లు జరిగాయన్నారు. నర్సింగ్ కళాశాల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుందన్నారు. సిమ్స్ కళాశాలకు మరిన్ని నిధులు తీసుకవచ్చి అద్భుతమైన ఆస్పత్రి, కళాశాలగా నిర్మించుకుంటున్నామనీ, అటుగా 80 ఫీట్లతో విశాలమైన రోడ్లు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 400 మంది నర్సింగ్ సిబ్బందితో రోజూ 2వేల ఓపీ సేవలు అందుతున్నాయన్నారు. ఇక రోడ్ల అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదన్నారు. కొన్ని నష్టాలు జరగడం నాకూ బాధగానే ఉందనీ, కానీ నగరాల జాబితాలో చేరాలంటే తప్పదన్నారు.
రెండేళ్లలో ప్రభుత్వం రూ.800 కోట్లు తీసుకవచ్చానని గర్వంగా చెబుతున్నానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం వద్ద 800 మెగావాట్ల బీ పవర్హౌస్ నిర్మాణం జరిగి తీరుతుందన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ సంస్థల సీఎస్సార్ నిధులను పదేళ్లలో అభివృద్ధికి కేటాయించలేదనీ, తాను గెలిచాక ముందుగా ఇక్కడి పరిశ్రమల యాజమాన్యంతో చర్చించి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నానన్నారు. అతి త్వరలోనే గోదావరిఖని నగరంను అద్భుతమైన నగరంగా ప్రజలు చూడబోతున్నారనీ, ఈ విషయంలో ఎక్కడ కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.