06-02-2026 12:00:00 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి) : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, జనరల్ అబ్జర్వర్ సీహెచ్. సత్యనారాయణ రెడ్డిల సమక్షంలో గురువారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు.
ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయన్న, డీఈఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు.