27-01-2026 12:45:45 AM
లారింజెక్టమీ సర్వైవర్స్ సమూహ జాతీయ గీతాలాపనతో ప్రపంచ రికార్డు
హైదరాబాద్, జనవరి 26: బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరపేటిక క్యాన్సర్ కారణంగా లారింజెక్టమీ శస్త్రచికిత్స పొందిన క్యాన్సర్ విజేతలు కలిసి జాతీయ గీతం ‘జనగణమన’ను ఆలపించి ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికారు.
ఆస్పత్రి ప్రాంగంణంలో నిర్వహించిన ఈ విశిష్ట కార్యక్రమంలోలారింజెక్టమీ సర్వైవర్స్ ఎలక్ట్రోలారింక్స్ పరికరాలు,ట్రాకియోఈసోఫేజియల్ వాయిస్ ప్రోస్తెసిస్ (టీఈపీ) సహా యంతో సమూహంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ అరుదైన, వినూత్న ప్రయత్నాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ అధికారికంగా ధృవీకరించి, లారింజెక్టమీ సర్వైవర్స్ ద్వారా నిర్వహించిన తొలి సామూహిక జాతీయ గీతాలాపనగా ప్రపంచ రికార్డుగా గుర్తించింది.
ఈ సందర్భంగా నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ (ఎన్బీటీఆర్ఎంసీఎఫ్) చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే నందమూ రి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో ఆసుపత్రి బోర్డు సభ్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, జేఎస్ఆర్ ప్రసాద్,సీఈఓ డాక్టర్ కృష్ణయ్య,మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రమణ్యేశ్వర రావు,చీఫ్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ డాక్టర్ ఎల్ఎం చంద్రశేఖరరావు, సీనియర్ ఆంకాలజిస్టులు, వైద్య సిబ్బంది, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.