26-01-2026 11:17:02 AM
ముగ్గురు సిబ్బందికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులు
కామారెడ్డి, జనవరి 26(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ దివ్య మేడం జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగ విలువలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలు అందించినందుకు బిక్నూర్ పీహెచ్సీ నుంచి ముగ్గురు సిబ్బందిని “బెస్ట్ ఎంప్లాయ్” అవార్డులకు ఎంపిక చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న హెల్ప్ అసిస్టెంట్ సతీష్, నర్సింగ్ ఆఫీసర్ హరిత, అలాగే బిక్నూర్ ‘ఏ’ సబ్ సెంటర్లో పనిచేస్తున్న ఆశా కార్యకర్త సంతోషి ఈ అవార్డులు పొందుతున్నారు.
వీరికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దివ్య మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పనితీరును పరిశీలించిన అనంతరం బిక్నూర్ పీహెచ్సీ నుంచి ముగ్గురు ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు. ఇది మొత్తం సిబ్బంది కృషికి ప్రతీకగా భావించాలన్నారు. భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బిక్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.