09-06-2025 06:21:21 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar)కు సోమవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాలి కృష్ణారెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పట్టణ శాఖ ఆధ్వర్యంలోని నేతలు కలిసి కేంద్ర మంత్రిని కలిసారు. హుజూరాబాద్లో అనేక మంది ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు ఉన్నప్పటికీ, సరైన క్రీడా మైదానం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రికి వివరించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఆ హామీల అమలవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ పట్టణంలోని కాలేజీ గ్రౌండ్, హై స్కూల్ గ్రౌండ్లు మినీ స్టేడియం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించి వీటిలో ఒకటిని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, నియోజకవర్గ మండల అధ్యక్షులు రాముల కుమార్, తూర్పాటి రాజు, సంపెల్లి సంపత్ రావు, కొలగాని రాజు, బైరెడ్డి రమణారెడ్డి, ర్యాకం శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.