09-06-2025 06:18:19 PM
బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నా బీసీ గురుకులల్లో అక్రమంగా, కనీసం విద్యార్హతలు లేకుండా హైదరాబాదులోని విఎల్ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా నియమించబడిన ల్యాబ్ అటెండర్లు, అటెండర్లను తక్షణమే తొలగించాలని బీసీ గురుకుల ఆర్సిఓపై జిల్లా కలెక్టర్ కు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్(BC Student Union State Working President Pagidi Jeedaiah Yadav), బీసీ రాజ్యాధికార సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీసీ గురుకులాల్లో ల్యాబ్ అటెండర్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపు చదివి ఉండాల్సినప్పటికిని కనీసం అర్హత లేకుండా పదో తరగతి చదవని వ్యక్తులకు కూడా ల్యాబ్ అటెండర్ గా, అటెండర్లుగా హైదరాబాదులోని విఎల్ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా అక్రమంగా రిక్రూట్ చేశారని తక్షణమే వారిని తొలగించాలని కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.
ఒకవైపు డిగ్రీలు చదివి నిరుద్యోగులు పట్టా సర్టిఫికెట్ తీసుకొని రోడ్లమీద తిరుగుతుంటే క్వాలిఫికేషన్ లేని వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల వచ్చిరాని చదువుల తోటి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ సెలెక్ట్ చేసినటువంటి ఏజెన్సీని పక్కనపెట్టి హైదరాబాదులో ఉన్నటువంటి నల్గొండ జిల్లాకి సంబంధం లేనటువంటి విఎల్ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇవ్వడం పట్ల భారీ కుట్ర దాగుందని ఆరోపించారు. తక్షణమే అక్రమ ఏజెన్సీ ద్వారా వచ్చినటువంటి అర్హత లేని వారిని తక్షణమే తొలగించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కలెక్టర్ కి విన్నవించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మార్గం సతీష్ కుమార్, గడగోజు విజయకుమార్, దీకొండ నవీన్, రాజు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.