11 May, 2026 | 5:21 PM

విధి నిర్వహణలో అలుపెరుగని శ్రామికుడికి విరామం

29-04-2026 09:09 PM

150 రూపాయల వేతనంతో మొదలైన జీవిత ప్రస్థానం

38 సంవత్సరాల పాటు విధి నిర్వహణలో అంకితభావం

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి):  తిరుమలాయపాలెం మండలానికి చెందిన యడ్ల ప్రభాకర్ విద్యుత్ శాఖలో 38 సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలు అందించి లైన్ ఇన్స్పెక్టర్గా పదవీ విరమణ పొందుతున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన 150 రూపాయల వేతనంతో కార్మికుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి క్రమంగా అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. వేదుల్లచెరువు గ్రామంలో విద్యుత్ శాఖలో కార్మికుడిగా మొదలైన ఆయన ప్రయాణం విలేజ్ వర్కర్‌గా కొనసాగి 2003లో ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు పొందారు.

తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, బయ్యారం మండలాల్లో విధులు నిర్వహిస్తూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఒక సందర్భంలో విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుని మళ్లీ విధుల్లో చేరి తన సేవలను కొనసాగించారు. తోటి ఉద్యోగులు, గ్రామ ప్రజల మన్ననలు పొందిన ప్రభాకర్ పలుపదోన్నతులు అందుకుని ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు, పలు గ్రామాల ప్రజలు ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.