17-06-2025 12:09:44 AM
సంగారెడ్డి నూతన కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి, జూన్ 16(విజయక్రాంతి): ప్రజా సమస్యలపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని, తన వద్దకు వచ్చే ప్రతి ఫైల్కు పూర్తి వివరాలను జత చేయాలని సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ముగిసిన అనంతరం తొలిసారిగా జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి తన వద్దకు పంపే ఫైల్స్ కు పూర్తి సమాచారంను జత చేసి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న ఫైల్స్ ను పంపాలని జిల్లా అధికారులకు సూచించారు. జిల్లాలో తలెత్తే సమస్యల గురించి ఆయా శాఖల అధికారులు వెంటనే తనకు నేరుగా సమాచారం ఫోన్ ద్వారా గాని వాట్సాప్ కాల్ ద్వారా గాని ఇవ్వాలన్నారు.
ఆయా శాఖలలో పెండింగ్ ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. త్వరలో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షకు అధికారులు పూర్తి సమాచారంతో నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. నివేదికలలో తాజా సమాచారం కూడా అందుబాటులో ఉండాలన్నారు.
అధికారులు జిల్లాలో పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాలకు సంబంధించిన పూర్తి సమాచారం వెంట అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులు స్పందించాలని సూచించారు. అధికారులు తమ వద్ద ఫైలు పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, పద్మజరాణి, వివిధ శాఖల జిల్లా అధికారులుపాల్గొన్నారు.