31-07-2025 12:00:00 AM
చిల్లరే కానీ.. లెక్కేస్తే రూ.లక్షలే..
వినియోగదారుల జేబుకు చిల్లులు
నల్లగొండ టౌన్, జూలై 30 : నల్గొండ పట్టణానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల గ్యాస్ సిలిండరు మీద అదనపు వసూళ్లపై డెలివరీ బాయ్ ని నిలదీశాడు. వెంటనే ఆ వ్యక్తి.. సిలిండరు ఇవ్వడానికి నిరాకరించాడు. గట్టిగా మాట్లాడితే ఇంటి బయటే సిలిండరు వదిలేశాడు. చేసేదిలేక విశ్రాంత ఉద్యోగి పూర్తి మొత్తం ఇవ్వాల్సి వచ్చింది. నల్గొండ వెంకటేశ్వర కాలనీకి చెందిన ఓ గృహ వినియోగదారుడు పది రోజుల క్రితం గ్యాస్ తెప్పించుకున్నాడు.
వాస్తవ సిలిండరు ధర కంటే.. అదనంగా రూ.30 వసూలు చేశారు. సదరు గృహ వినియోగదారు ఇంటికి, గ్యాస్ గోదాముకు మధ్య దూరం కేవలం రెండు కిలోమీటర్ల లోపే. అయినా ఎక్స్? ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీకి చైతన్యపురి కాలనీ 5 కి.మీ దూరం లోపే ఉంది. ఇక్కడ వంట గ్యాస్ డోర్ డెలివరీ చేసేందుకు సంబంధిత ఏజెన్సీ డోర్ డెలివరీ బాయ్ సిలిండర్ ధర కంటే అదనంగా 30 రూపాయలు వసూలు చేశాడు.
సదరు గృహిణి మారుమాట్లాడకుండా ఆ మొత్తం ఇచ్చేశారు. ఇలా కేవలం నల్గొండ జిల్లాలోనే కాదు.. నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండరు ధరపై అదనపు వసూళ్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గృహావసరాల గ్యాస్ సిలిండరు ధర బహిరంగ మార్కెట్కు అనుగుణంగా మారుతోంది.
ఒక్కో నెలలో పెరుగుతూ, మరో నెలలో తగ్గుతూ ఉండటం వల్ల వాస్తవ ధర వినియోగదారులకు స్పష్టంగా తెలిసే పరిస్థితి ఉండటం లేదు. ఇదే ఎక్కువనుకుంటే.. సిలిండరు అసలు ధర కంటే.. ఇంటికి అందించే సమయంలో అదనంగా వసూలు చేస్తుండటం మరింత భారమవుతోంది. ఈ వసూళ్లు చిల్లరగా కనిపించినా.. నెలనెలా ఇది లక్షల్లో సాగుతోంది.
చిల్లరే అయినా... లక్షల్లోనే....?
ఉమ్మడి జిల్లాలో 71 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. సాధారణ, సీఎస్ఆర్, దీపం కలిపి మొత్తం 8,94,536 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ గ్యాస్ వినియోగం తప్పనిసరైంది. ఇందులో ప్రతి నెలా క్రమం తప్పకుం డా సిలిండరు తీసుకుంటున్న కనెక్షన్లు 4 లక్షలు వేసుకున్నా..
ఒక్కో వినియోగదారుడి నుంచి సగటున రూ.20 అదనపు వసూళ్లు అనుకున్నా.. మొత్తంగా 80 లక్షల రూపాయలను చెల్లిస్తున్నట్లే, మనం చిల్లరే కదా అని వదిలేసిన మొత్తం ఒక నెలలో రూ. 80 లక్షలు. అవుతుంది.
అక్రమ వసూళ్ల దందా..
జిల్లాలో గ్యాస్ సిలిండరు సరఫరా అక్ర మ వసూళ్ల దందా ఎప్పటినుంచో సాగుతున్నా.. అధికారులు పట్టించుకున్న దాఖ లాలు కనిపించడం లేదు. ఒక వైపు బిల్లులపై ఉన్న ధరకు అదనంగాచెల్లించవద్దని ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ఇంటికితీసుకొచ్చే ఏజెన్సీ సిబ్బంది మాత్రం రూ.30 నుంచి రూ.50 వరకూ ప్రాంతాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే సిలిండరుపై రూ.20 నుంచి 30 వరకు ఆదనంగా వసూలు చేస్తున్నారు.
చాలామంది గృహిణులు వాస్తవ మొత్తాన్ని గమనించకుండా అడిగినంతా ఇచ్చేస్తున్నారు. కొంతమంది ప్రశ్ని స్తే.. దురుసుగా ప్రవర్తించడం, సిలిండరు వెనక్కి తీసుకెళ్లిపోయి, తాళం వేసి ఉందని నమోదు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు. తమకేమీ జీతం ఉండదని, తెచ్చినందుకు చార్జీల రూపంలో వచ్చేదే ఆదాయమని చెప్పడంతో మారుమాట్లాడకుండా ఆ మొత్తా న్ని ఇచ్చేస్తున్నారు.
గ్యాస్ ఏజెన్సీలు నిర్ణయించిన ధరే తాము వసూలు చేస్తున్నా మని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.50కి తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో మహిళలు చాలా మంది దీపం పథకాన్ని వినియోగిస్తున్నారు. వీరికి ఏజెన్సీలు చాలా కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. తాము వెళ్లి సిలిండర్లను తెచ్చుకోలేక, ఇంటికి తీసుకొస్తే అదనపు మొత్తం చెల్లించలేక గ్యాస్ వినియోగానికి దూరం అవుతున్నారు.
ఐదు కిలోమీటర్లు దాటితేనే గ్యాస్ సిలిండర్లకు అదనంగా వసూలు చేయవద్దని ఏజెన్సీలకు చెబుతున్నట్లు పౌరసర ఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సిలిండరు డెలివరీ పరిధి ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే ఉచితమేనని, పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. ఐదు నుంచి 30 కిలోమీటర్లవరకైతే రూ.10 మాత్రమే అదనంగా వసూలు చేస్తారని తెలిపారు. ఏజెన్సీ లు, సిబ్బంది వినియోగదారులను ఇబ్బం ది పెట్టకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అధికారులు వివరించారు.
చర్యలు తీసుకుంటాం
గ్యాస్ డెలివరీ బాయ్స్ సిలిండర్ సరఫరా సమయంలో అదనంగా రూ.30 వసూలు చేస్తున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు చేపడతాం.
వెంకటేశ్వర్లు (జిల్లా సివిల్ సప్లయ్ అధికారి)