31-07-2025 12:00:00 AM
తప్పిన పెను ప్రమాదం
మునిపల్లి, జూలై 30: మండలంలోని మక్తక్యాసారం రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సదాశివపేట నుంచి రోజు మాదిరిగానే బుధవారం ఉదయం మక్త క్యాసారం విద్యార్థులు, ప్రయాణికులను సదాశివపేటకు వస్తున్న క్రమంలో పెద్దలోడి గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను, రోడ్డుపై ఏర్పడిన గుంతను తప్పించబోయి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది.
డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 60 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదుపు తప్పుతున్న బస్సును రోడ్డుపైకి ఎక్కించే క్రమంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.
ఆర్టీసీ బస్సు అదుపు తప్పిన విషయాన్ని సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ కు సమాచారం అందించగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాగా రోడ్డు బాగా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని డిపో మేనేజర్ తెలిపారు.