8 June, 2026 | 7:17 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

08-06-2026 06:12 PM

భద్రాద్రి కొత్తగూడెం/ఇల్లెందు, (విజయక్రాంతి): జిల్లాలో నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పరీక్షా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 పునఃపరీక్షకు జిల్లాలో మొత్తం 1,128 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.

ఇందుకోసం జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సింగరేణి ఉమెన్స్ కళాశాలలో 360 మంది, టీజీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాల మరియు కళాశాల, పాల్వంచలో 288 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచలో 240 మంది, శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కొత్తగూడెంలో 240 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు వివరించారు. అభ్యర్థులను ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, భద్రతా తనిఖీలు వంటి ప్రక్రియల దృష్ట్యా అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

అడ్మిట్ కార్డుపై తప్పనిసరిగా ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో అతికించుకోవాలని, అదనంగా మరో పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు తాజా ఫోటో ఉన్న గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పర్సులు, వాచీలు, బెల్టులు, చైన్లు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఉంగరాలు తదితర ఆభరణాలు అనుమతించబడవని స్పష్టం చేశారు. అభ్యర్థులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని, ప్రశ్నాపత్రాల రవాణా మరియు పరీక్ష అనంతరం జవాబు పత్రాల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. పరీక్షా రోజున విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా కల్పించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. నీట్ పరీక్ష విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైనదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. నీట్ (యూజీ)-2026 పునఃపరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా నుంచి జవాబు పత్రాల భద్రత వరకు అన్ని దశల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడతామని చెప్పారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, పరీక్షా నిబంధనలను పాటిస్తూ నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు, డి సెక్షన్ సూపర్డెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, తాసిల్దార్లు పుల్లారావు, దారా ప్రసాద్,పరీక్షా కేంద్రాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.