28-05-2025 12:00:00 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ, మే 27 (విజయ క్రాంతి): లైసెన్స్ సర్వేయర్ శిక్షణా కార్యక్రమంలో సర్వేకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని సాంకేతిక శిక్షణాభివృద్ధి కేంద్రం (టిటిడిసి)లో జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేయర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో సర్వే నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై నిర్వహిస్తున్న బోధనా తరగతులను, అంశాలను పరిశీలించారు.
శిక్షణార్థులకు సంబంధించిన మెటీరియల్ను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ లైసెన్స్ సర్వేయర్లకు 50 రోజులపాటు నిర్వహించే శిక్షణ కాలంలో సర్వేకు సంబంధించిన అన్ని అంశాలపై పట్టు సాధించే విధంగా శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.
శిక్షణ అనంతరం అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని ప్రతిభ కనబరిచిన వారికి భూభారతి సర్వే చేసేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ సర్వే రికారడ్స్ ఏడి శ్రీనివాసులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.