దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు బలి
నిర్లక్ష్యంగా లారీలు నడుపుతున్న డ్రైవర్లు
భూపాలపల్లి ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు
పలువురు మృత్యువాత.. కొందరికి గాయాలు
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
అది భూపాలపల్లి శివారులోని మంజూర్నగర్ బస్షెల్టర్. బస్సు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు. ఒక్కసారిగా దూసుకువచ్చిన ఇసుక లారీ. క్షణాల్లో ప్రయాణికులను ఢీ. ప్రమాదంలో ముసలనాయుడు, సత్యనారాయణ అనే ప్రయాణికులు మృత్యువాత. మరో ఇద్దరు ప్రయాణికులు అప్పలనాయుడు, మధూకర్రెడ్డి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం. డ్రైవర్ నిర్లక్ష్యం రోడ్డుప్రమాదానికి హేతువు. ఘటన జరిగి మూడు రోజులు. ప్రమాదానికి కారణం. హై స్పీడ్.. ఓవర్ లోడ్.. డ్రైవర్లు నిర్లక్ష్యంగా బొగ్గు, ఇసుక లారీలను నడుపుతుండడంతోనే ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి, మే14 (విజయక్రాంతి) : భూపాలపల్లి జవహర్నగర్ కాలనీలో ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదుట ఓ వ్యక్తి నించున్నాడు. ఓవర్ స్పీడ్తో వచ్చిన బొగ్గు లారీ వ్యక్తిని ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాల పాలై అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జరిగి నెలరోజులైంది. అంబేద్కర్ సెంటర్లోని హోటల్ సెంటర్లో లారీ వేగంగా దూసుకొచ్చి మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాడు. ఈ ఘటన జరిగి ఆరు నెలలైంది. ఇలా.. భూపాలపల్లి జిల్లాకేంద్రంతోపాటు మండల పరిధిలో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఒకరో ఇద్దరో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు క్షతగాత్రులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిత్యం రద్దీ..
జిల్లాకేంద్రంలోని భూపాలపల్లితో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. బొగ్గు, ఇసుక లారీలు ఢీకొని నిత్యం ఏదోఒక ప్రాంతంలో ప్రమాదాలు సంభవిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. కాళేశ్వరం నుంచి, తాడిచెర్ల, భూపాలపల్లి నుంచి నిత్యం వందలాది లారీలు ఇసుక, బొగ్గు రవాణా చేస్తున్న క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రేయింబవళ్లు తోలకాలు చేస్తుం డడం, హారెన్ మోతతో స్థానికులకు కంటిమీద కునుకు ఉండడం లేదు. ఓవర్ లోడ్తో వెళ్తుంటే రహదారులు ఛిద్రమవుతున్నాయి. ఓవర్స్పీడ్తో డ్రైవర్లు లారీలు నడుపుతుండడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కాళేశ్వరం నుంచి వచ్చే ఇసుక లారీలతో పాటు తాడిచెర్ల జెన్కోబ్లాక్ ఓపెన్ కాస్టు, భూపాలపల్లి గనుల నుంచి వచ్చే బొగ్గు లారీలు నిత్యం ఈ మార్గంలో వెళ్తుంటాయి. ఇసుక రీచ్ల నుంచి హైదరాబాద్ వంటి నగరాలకు భారీగా ఇసుక రవా ణా అవుతూ ఉంటుంది. ఇసుక, బొగ్గు లారీలు పరిమితికి మించిన లోడ్తో వెళ్తుండడంతోనే ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పం దించి లారీ డ్రైవర్ల దూకుడుకు కళ్లెం వేయాలని, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






