calender_icon.png 1 November, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

31-10-2025 05:40:20 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నుండి మొదలుకొని కాంట అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ పనులను మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. రెండువైపులా కలిపి 100 ఫీట్ల మేర రోడ్డును వెడల్పు చేయనున్నారు. చౌడేశ్వరి, ఏఎంసి, సి ఎస్ ఐ, పాత మున్సిపల్ కార్యాలయం, సింగరేణి స్టోర్, కాంట అంబేద్కర్ చౌరస్తా పెద్ద కాలువ వరకు మొదటి దశలో ఈ రోడ్డు వెడల్పు పనులను చేపట్టనున్నారు.

ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. రోడ్డుకు రెండు వైపులా ఉన్న దుకాణాలను, ఫుట్ పాత్ వ్యాపారులు వేసుకున్న తాత్కాలిక షెడ్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మున్సిపల్ యంత్రాంగం నాలుగు జెసిబి లతో రోడ్డుపై ఉన్న తాత్కాలిక షెడ్లను కూల్చివేశారు. ఏఎంసీ ప్రాంతంలో రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను, చెట్లను తొలగించారు.

ప్రహరీబెల్లంపల్లిలో  రోడ్డు విస్తరణ కోసం మున్సిపల్ యంత్రాంగం చేపడుతున్న పనులను సబ్ కలెక్టర్ మనోజ్ పరిశీలించారు.రోడ్డు విస్తరణ పనుల వల్ల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తుతాయని వ్యాపారులు మున్సిపల్ అధికారులను వేడుకున్నారు. తమకు జీవనోపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. బెల్లంపల్లి ఏసిపి ఏ .రవికుమార్ నేతృత్వంలో సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్సైలు బందోబస్తును దగ్గరుండి పర్యవేక్షించారు.