22-01-2026 06:30:33 PM
జాతీయ రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన సదస్సులో మంథని-2 ఎస్ఐ సాగర్
మంథని, జనవరి22(విజయక్రాంతి): రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మంథని ఎస్ఐ-2 సాగర్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన లో భాగంగా గురువారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంథని పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ‘అరైవ్ అలైవ్’ పేరిట రోడ్డు భద్రతా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వాహనదారులకు, పాదచారులకు రోడ్డు నిబంధనలపై కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. నిబంధనలు పాటించడం అంటే కేవలం జరిమానాల నుండి తప్పించుకోవడం మాత్రమే కాదని, క్షేమంగా ఇంటికి చేరుకోవడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఈ సందర్భంగా హెచ్చరించారు. పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో వాహనాలను క్రమపద్ధతిలో నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మల్లయ్య తో పాటు స్థానిక వ్యాపారులు, పోలీసులు పాల్గొన్నారు.