భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల పర్యవేక్షణలో భద్రాచలం పట్టణం
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 2000 మంది పోలీసులతో ప్రత్యేక నిఘా
ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు : ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 26, (విజయక్రాంతి): శుక్రవారం జరగనున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం, శనివారం నాడు జరగనున్న పట్టాభిషేకం మహోత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.
సుమారుగా రెండు వేల మంది పోలీసులతో ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కొరకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ , ఆన్లైన్ లింకును రూపొందించడం జరిగిందన్నారు. భద్రాచలం పట్టణం మొత్తం డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ లతో నిరంతర పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. భద్రాచల పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ఈ రెండు రోజులపాటు పోలీసు వారు విధించే ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను పొందాలని కోరారుకోరారు.




